నా గురించి

Friday, December 14, 2012

క్షీరసాగర మథనము

క్షీరసాగర మథనమ్ము జేయ మంద
రగిరి కవ్వమై వాసుకి త్రాడు గాగ
కొండ నెత్తగ విష్ణువు కూర్మ మయ్యె
దేవ దానవుల్ జిలికిరి దినము పగలు

క్రమమునన్ బుట్టె చంద్రుడు కమలవాసి
కామధేనువు చౌదంతి కల్పతరువు
మదిర హాలాహలమ్ములు ; తుదకు బుట్టె
నమృతము సురలు రాక్షసులబ్బుర పడ

గరళమును మ్రింగి గాచె లోకముల నెల్ల
హరుడు ;మోహిని రూపమై యవతరించె
హరియె పంచె నమృతమును సురలు ద్రావ ;
నాంది దేవదానవ పోరు నాటి నుండి.

Wednesday, October 24, 2012

జీవ వైవిధ్యం




ఇన్నాళ్ళూ -  
మనం మన గురించే ఆలోచించాం 
మనతో పాటు యితర ప్రాణులు కొన్ని 
వున్నాయన్న సంగతిని మరిచాం 

చెట్లను నరికివేస్తుంటే 
పులులు నగరాల మీద పడవా మరి ?
వేటాడి పట్టుకొని తింటుంటే 
జంతువులు పక్షులు అంతరించిపోవా మరి ? 
సెల్ ఫోన్ టవర్ల విద్యుత్తరంగాల తాకిడికి  
పిచ్చుకలన్నీ మచ్చుకు లేకుండా పోయాయి 

పొలాలపై చల్లే మందులతో 
చస్తున్నాయి పందులు 
జంతు కళేబరాలను పీక్కుతొనే 
రాబందులు సైతం మరణిస్తున్నాయి
నేడు కళేబరాలు సైతం విషపూరితం ! 

మనం మహానగరాలను నిర్మించుకుంటూ 
కీకారణ్యంలోని ప్రాణులకు 
ఒకింత చోటు లేకుండా చేస్తున్నాం 
ఏవీ ఆ పాలపిట్టలు ! 
ఏవీ ఆ భరద్వాజ పక్షులు ! 
ఏవీ ఆ ఊరబిచ్చుకలు ! 

నాగరికుల ధనకాంక్షకు బలై 
ఆవాసాలను కోల్పోతున్నారు అడవి బిడ్డలు 
పచ్చని చెట్లను కోల్పోయి 
పర్యావరణం తలక్రిందు లవుతోంది 
తోటి ప్రాణులను హింసించిన పాపానికి 
యిప్పుడు మన ఉనికికే ప్రమాదం 
ముంచుకొస్తోంది ! 
ఏదీ పరిష్కారం ? 
కాస్త ఆలోచిద్దాం ! 

‘నేటి నిజం' - సాహితీ కెరటాలు తేది: 11-10-2012 దినపత్రికలో ప్రచురితం 

Saturday, September 29, 2012

ప్రాణం కంటే సంస్కృతి గొప్పది



పూర్వం హర్ష చక్రవర్తి భారత దేశాన్ని పరిపాలించే కాలంలో "హువాన్ సంగ్ "అనే చైనా దేశస్థుడు భారత దేశాన్ని దర్శించేందుకు వచ్చాడు. అతడు భారత దేశంలో వున్న అనేక ప్రదేశాలు తిరిగాడు. అక్కడి ప్రజల గురించి తెలుసుకున్నాడు. భారతీయ సంస్కృతిని అధ్యయనం చేశాడు.  అతడు ఎన్నో గ్రంధాలను ఐతిహాసిక వస్తువులను సేకరించాడు.  

హువాన్ సంగ్ స్వదేశానికి తిరిగి వెళుతూ, హర్ష చక్రవర్తిని దర్శించి తన అనుభవాలను నివేదించి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. హర్షుడు  అతని రక్షణార్థం ఇరవై మంది సైనికులను అతని వెంట పంపాడు. 

హర్షుడు ప్రయాణారంభ సమయంలో సైనికుల నుద్దేశించి, " సైనికులారా! యితని నౌకలో వివిధ భారతీయ ధర్మశాస్త్ర గ్రంధాలు మరియు అనేక ఐతిహాసిక వస్తువులు వున్నాయి. అవి భారతీయ సంస్కృతికి ప్రతీకలు. చాలా అమూల్యమైనవి. అందువల యితనిని మరియు యీ గ్రంధాలను వస్తువులను పరిరక్షించడం మీ కర్తవ్యం. " అని అన్నాడు.   

ప్రయాణం ప్రారంభమైంది. చాలా రోజుల వరకూ ప్రయాణంలో ఎటువంటి అవాంతరం  కలుగలేదు. అకస్మాత్తుగా ఒకరోజు సముద్రంలో తుఫాను సంభవించింది. దాని మూలంగా నౌక సముద్రంలో ఊగిసలాడసాగింది. " నావ నీళ్ళలో మునిగిపోతుందో ఏమో ? " అన్న శంక ఉత్పన్న మైంది. ఓడ సరంగు భయకంపితుడై యిలా అరిచాడు " నౌక బరువు అధికమైంది.  తొందరగా యీ   నావలోని గ్రంధాలను వస్తువులను సముద్రంలోకి విసిరివేసి మీ ప్రాణాలను రక్షించుకోండి " 
 
అప్పుడు సేనాపతి సైనికుల నుద్దేశించి యిలా అన్నాడు " యోధులారా ! ఇది మనకు అగ్ని పరీక్ష. ధర్మశాస్త్ర గ్రంధాలను వస్తువులను , వాటి ద్వారా భారతీయ సంస్కృతిని రక్షించడం మన కర్తవ్యం. అందుకు అందరూ సిద్దంగా వుండండి. ప్రాణాలను అర్పించైనా మనం మన కర్తవ్యాన్ని పాలించాలి. "

నాయకుడి మాటలు విన్న మరుక్షణమే సైనికు లందరూ ఒక్కసారిగా సముద్రంలోకి దుమికారు. భారతీయ సంస్కృతిని రక్షించడం కోసం తమ  ప్రాణాలను గడ్డిపోచల వలె త్యాగం చేశారు.   

అత్యాశ్చర్యకరమైన యీ దృశ్యాన్ని చూసిన హువాన్ సంగ్ కనులలో అశ్రువులు వుబికాయి.     


మూలం : సంస్కృత కథా - ప్రాణాదపి సంస్కృతి: శ్రేష్ఠ 

( సుగంధ: సంస్కృత కథా సంగ్రహ: నుండి )

Saturday, September 15, 2012

ధర్మ దృష్టి


శ్రీ రామచంద్రునికి రావణునకు మధ్య యుద్ధం సంభవించింది. రావణుడు భయంకరంగా యుద్ధం చేశాడు. అప్పుడు శ్రీ రాముడు బ్రహ్మాస్త్రాన్ని  ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రంతో రావణుడు మరణించాడు. అది చూచి విభీషణుడు ఎంతో దు:ఖించాడు. మండోదరి కూడ ఎంతగానో రోదించింది.  

రాముడు విభీషణునితో   " విభీషణా ! విలపించకు ! రావణుడు వీరస్వర్గ మలంకరించాడు. ఇప్పుడు శవదహన సంస్కార సమయం. అందుకు సిద్ధం చెయ్ ! " అని అన్నాడు. 

" రామా ! రావణుడు అధర్మ వర్తనుడు, పరస్త్రీ కాముకుడు, దుష్టుడు, పాపి. అందువలన నేనతనికి శవసంస్కారం చేయను" అని విభీషణుడు పలికాడు. 

" విభీషణా ! " మరణాంతం వైరం ". అంటే మరణం వరకే శత్రుత్వం ఉంటుంది. మరణం తరువాత శత్రుత్వం అనుచితం, ధర్మ విరుద్ధం. ఇప్పుడు రావణుడు మృతి చెంది యున్నాడు. అతని కొడుకు లందరూ కూడ మరణించారు. కుంభకర్ణుడు కూడ మృతి చెందాడు. కనుక రావణుని శవదహన సంస్కారాలు నీవే చేయాలి. " అని శ్రీ రాముడు పలికాడు.    

విభీషణుడు " రామా ! ఐననూ రావణుడు పాపి......."   

రాముడు గంభీర స్వరంతో  " విభీషణా !  " మరణాంతం వైరం" . అందువలన నాకు కూడ ఇప్పుడు రావణుని విషయంలో శత్రుత్వం లేదు. అతడు నీకెలా సోదరుడో, నాకూ అలాగే. ఒకవేళ నీవు  చేయకపోతే అతనికి శవసంస్కారం నేనే పూర్తిచేస్తాను" అని పలికాడు.  

విభీషణుడు శ్రీరామునికి అంజలి ఘటిస్తూ అన్నాడు " క్షమించండి. నేను శవదహనసంస్కారం చేస్తాను. రామా ! నీ ధర్మ దృష్టి అసాధారణం "



ధర్మమూర్తి  శ్రీ రామచంద్రునికి ప్రణామములు. 


సుగంధ: సంస్కృత కథా సంగ్రహ : నుండి 

Tuesday, September 11, 2012

పరహిత చింతనం

ఒకానొక వైశ్యుడు వ్యాపార నిమిత్తం దూరదేశం పోతూ, తన సామానులన్నీ ఒక ఒంటెపై వేసి ప్రయాణం సాగించాడు. మార్గమధ్యంలో ఒక ఎడారి వచ్చింది. వైశ్యుని వద్ద ఆహారం స్వల్పంగా వుంది. ఐదురోజులు గడిచాయి. ఆహారం పూర్తిగా ఐపోయింది. వైశ్యుడు దేవుణ్ణి ప్రార్థించాడు, " దేవుడా ! నాకు ఆహారాన్ని ప్రసాదించు !" పదిరోజులు గడచిపోయాయి. వైశ్యునికి ఆహారం లభించలేదు. తనతో తెచ్చుకున్న నీరు కూడ ఐపోయింది. ఎక్కడా నీటి జాడ లేదు. ఎటు చూచినా ఇసుకే. ఎండ మండిపోతోంది. 

వైశ్యుడు దీనంగా " దేవుడా ! నీరు లేదు, అన్నం లేదు. కరుణించి ప్రసాదించు !" అని వేడుకున్నాడు. 
మూడు రోజులు గడిచాయి. వైశ్యుడు ఒక్క అడుగు కూడ ముందుకు వేయలేక పోతున్నాడు. అతడు దేవుణ్ణి దూషించడం మొదలు పెట్టాడు. " నీవు భక్తప్రియుడవు గాదు. నీ హృదయం  కఠినం. తాగడానికి నీరు కూడ నీ వివ్వడం లేదు. " 

ఇంకా మూడు రోజులు గడిచాయి. వైశ్యుని కాళ్ళలో చేతుల్లో  శక్తి పూర్తిగా నశించిపోయింది. ఒంటె ఇసుకలో కూలబడి వుంది. దాహంతో అది దీనంగా చుట్టూ పరికిస్తోంది. వైశ్యుని హృదయం కరుణతో నిండిపోయింది. అతడు ఇలా చింతించాడు " నే నింతవరకు నా విషయమే ఆలోచించాను. ఈ ఒంటె నన్ను మోస్తూ నాకు సేవ చేస్తోంది. ఇప్పుడు ఇది మరణావస్థలో వుంది. దేవుడా ! అనుగ్రహించు ! లేకుంటే మా చావు ఖాయం !" 

అంతలోనే దూరంగా నీటి శబ్దం వినిపించింది. వైశ్యుడు కష్టంగా లేచి నిలబడి నీటి శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. ఒంటెను కూడ తనతో తీసికెళ్ళాడు. దానికి నీరు త్రాగించి, తను కూడ దాహం తీర్చుకున్నాడు. సమీపంలో కనిపించిన పళ్ళని తిన్నాడు. ఒంటెకు కూడ ఆహారాన్ని అందించాడు. 

స్వార్థచింతనా పరుడైన వాడిని దేవుడెప్పుడూ అనుగ్రహించడు. పరహితం అభిలషించే వారిని మాత్రం తప్పక అనుగ్రహిస్తాడు. 


మూలం : పరహిత చింతనం  
 సుగంధ : సంస్కృత కథా సంగ్రహ: నుండి 

Monday, September 10, 2012

 నృపతుంగుని న్యాయపాలన



రాష్ట్రకూట వంశంలో జన్మించిన నృపతుంగుడు చక్రవర్తి, గుణశీలుడు మరియు న్యాయనిష్థ గలవాడు. న్యాయ మార్గంలో రాజు ప్రజలు అందరూ సమానులే అని అతని అభిప్రాయం.  నృపతుంగుని కుమారుడు కృష్ణుడు. అతడు కోపిష్ఠి. తండ్రిని నిందిస్తూ ప్రజలను పీడించే వాడు. ఎప్పుడూ దుర్జన సాంగత్యంలోనే కాలం గడిపేవాడు.     
 
అతడు ప్రౌఢ వయస్కుడవగానే శత్రుపక్షపు రాజు కుమార్తెను వివాహమాడి , వారి ప్రోద్బలంతో తండ్రి రాజ్యంపైనే దండెత్తాడు. నృపతుంగుడు  ధీరుడు, శూరుడు. యుద్ధంలో కృష్ణుడు ఓడిపోయి , బందీగా చిక్కాడు. న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. రాజు న్యాయాధీశుడు, కృష్ణుడు అపరాధి. ' తీర్పు ఎలా ఉంటుందో' అని ప్రజలంతా కుతూహలంతో ఉన్నారు. 'నేను అపరాధినే' అని కృష్ణుడు అంగీకరించి, పశ్చాత్తాప పడ్దాడు.  కృష్ణుడు స్వరాజ్య ద్రోహి  కాబట్టి అతనికి మరణ దండనే యుక్తం అని రాజు  తీర్పు నిచ్చాడు. ప్రజలంతా మౌనంగా వుండిపోయారు. " రాజు కొక్కడే కుమారుడు. అతడు లేకపోతే రాజ్యంలో అరాచకం ప్రబలొచ్చు. కాబట్టి అతడు జీవించి ఉండాలి" అని ప్రజలు కోరుకున్నారు. కుమారుణ్ణి క్షమించమని వారు రాజును ప్రార్థించారు. కాని రాజు అందుకు ఒప్పుకోలేదు.  

చివరికి  ప్రజల ఒత్తిడితో రాజు యువరాజును క్షమించి, " కుమారా! ప్రజలే నీకు ప్రాణభిక్ష పెట్టారు. కాబట్టి ప్రజా సేవయే నీ ప్రథమ కర్తవ్యం"  అని అన్నాడు. అనతి కాలంలోనే కృష్ణుడు ప్రజలను వాత్సల్యంతో పరిపాలిస్తూ మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు.       
 

" సుగంధ : సంస్కృత కథాసంగ్రహ:" నుండి  

Friday, August 31, 2012

వివేకము

                                            

పూర్వం కళింగ రాజ్యానికి రాజు సత్యగుప్తుడు. అతని కుమారుడు కమలాపీడుడు. అతడు ఎన్నో విద్యల నభ్యసించిన బుద్ధిశాలి. కాని కొంచెం అహంకారి కూడ. అతడు ఎల్లప్పుడు మహారాజునే పరిహసించేవాడు. 
రాజు వివేకి. తన కుమారుని అవివేకాన్ని గ్రహించి మనసులో బాధపడుతూ వుండే వాడు. 

రాజు వద్ద గొప్ప సైన్యం వుండేది. ఒకమారు యువరాజు సైన్యం విషయంలో  తండ్రితో ఇలా అన్నాడు " నాయనా! ఈ సైన్యం వల్ల ఏమి ప్రయోజనం? వీరిని పోషించడానికి అయ్యే ఖర్చువ్యర్థం." 
రాజు యిలా అన్నాడు" కుమారా! యుద్ద సమయంలో సైన్యం అత్యావశ్యకం. అందువల్ల సైనికులను ఎల్లప్పుడూ పోషిస్తూ వుండాల్సిందే! అప్పుడు వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి రాజ్యాన్ని రక్షిస్తారు. "
దానికి యువరాజు గర్వంగా" యుద్దం ఆసన్నమైనప్పుడు ధనం యిస్తే  ఎంతో మంది సైనికులు లభిస్తారు గదా! అన్నం కొరకు కాకులు ఎలా గుంపులు గుంపులుగా వచ్చి చేరతాయో అలా ధనం కోసం ప్రజలు వచ్చి చేరుతారు. " అని అన్నాడు.  మహారాజు మౌనంగా వుండి పోయాడు. 

రాజు ఆరోజు రాత్రి యువరాజును ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అక్కడ అన్నాన్ని నేలపై వుంచి, తన కుమారునితో " కుమారా! ఏదీ యిప్పుడు కాకులను పిలువ్!" అని అన్నాడు 
"రాత్రిపూట కాకులెలా వస్తాయి? మీరేమైనా మూర్ఖులా ?" అని యువరాజు ప్రశ్నించాడు. 
" కుమారా! నేను మూర్ఖుడిని కాను. నీ అవివేకాన్ని తొలగించడానికే నేనిలా చేశాను. ఎలా ఇప్పుడు అన్నం కోసం కాకులు రావో , అలాగే యుద్దం వచ్చినప్పుడు ధనం యిచ్చినా కూడ సైనికులు ఎవరూ రారు. కనుక దేశాన్ని రక్షించుకోవడం కోసం ఎల్లవేళలా సైనికులను కాపాడుకోవాలి. " అని మహారాజు యువరాజు కుపదేశించి, అతని అవివేకాన్ని తొలగించాడు.  


సుగంధ: ( సంసృత కథాసంగ్రహ: ) నుండి 




Sunday, August 12, 2012

మనమున తాళంగలేక ...

సమస్య :

"మనమున తాళంగలేక మామను గోరెన్ ! "

నా పూరణ :

అనఘుడు భీముని వలచిన
దనుజుని కొమరిత హిడింబి ; దండక వన సీ
మ నిదాఘ ఘర్మపీడిత ;
మనమున తాళంగలేక మామను గోరెన్ !

భావము :

భీముని వరించిన హిడింబి, దండకారణ్యంలో చెమటలు పట్టే ఎండ వేడిమికి తాళలేక, మనసులో తన మామగారైన అంటే వాయుదేవుణ్ణి ( చల్ల గాలిని ) కోరుకున్నదని అర్థం.



అసలు దీనికి మూలం - ఒక అవధానంలో సంస్కృతంలో ఇవ్వబడిన ఒక సమస్య:

" స్తనవస్త్రం పరిత్యజ్య వధూ శ్వశుర మిఛ్చతి "

గణపతి శాస్త్రి అనుకుంటా - దీనిని ఇలా పూరించారని చదివాను.

హిడింబా భీమదయితా నిదాఘే ఘర్మపీడితా
స్తనవస్త్రం పరిత్యజ్య వధూ శ్వశుర మిఛ్చతి

( హిడింబాయా శ్వశుర : వాయు ఇతి ప్రసిద్ద మస్తి )

Sunday, April 29, 2012

సామల సదాశివ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ



ఈ రోజు  "హైదరాబాద్ స్టడీ సర్కిల్ " హాలులో జరిగిన ఒక కార్యక్రమంలో విశ్వనాథ సాహిత్య పీఠం వారు జయంతి త్రైమాసిక పత్రిక - సామల సదాశివ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ముందు మాటలో సంపాదకులు శ్రీ వెలిచాల కొండల రావుగారు, శ్రీ కె. జితేందర్ బాబు గారు "ఈ సంచికను వెలువరించడంలో మేము ఆశించిన లక్ష్యం సదాశివ బహుముఖీనత్వాన్ని ఇంతవరకు తెలియని మన పాఠకులకు తెలియ జెప్పాలని మాత్రమే మా ప్రయత్నం" అని చెప్పుకున్నారు.

ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో ఉర్దూ సాహిత్యాన్ని గురించి, హిందుస్తానీ సంగీతం గురించి శ్రీ సదాశివ వ్రాసిన కొన్ని వ్యాసాలను చేర్చారు. రెండవ భాగంలో సదాశివ సాహిత్యంపై కొందరి ప్రముఖుల అభిప్రాయాలు, సదాశివ వ్రాసిన కొన్ని లేఖలను ప్రచురించారు. ఇక మూడవ భాగంలో సదాశివతో జరిపిన ఇంటర్వ్యూ ; అందులో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్రచురించారు. రమణజీవి కవర్ డిజైన్ చేయగా, అన్నవరం శ్రీనివాస్ కవర్ పెయింటింగ్ వేశారు.

కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో శ్రీ బి. నరసింగరావు గారు, శ్రీమతి రావు బాలసరస్వతి గారు, అమ్మంగి వేణుగోపాల్ గారు, ఎలనాగ గారు, నాగరాజు రామస్వామి గారు, వి. ఆర్. విద్యార్థి గారు, దేవిప్రియ మొదలైన వాళ్ళున్నారు."నేనెరిగిన సదాశివ" అనే వ్యాసాన్ని అందించిన రావు బాల సరస్వతి సభాధ్యక్షులు శ్రీ పేర్వారం రాములు మరియు ఇతర పెద్దల కోరిక మేరకు రెండు గీతాల్లోని ( “నిండు పున్నమి పండు వెన్నెలలో "... మరియు "ఆ తోటలో నొకటి ఆరాధనాలయము ".. ) కొన్ని చరణాలు ఆలపించి ఆహుతులను అలరించారు.

Saturday, March 31, 2012

గతానుగతికో లోక :




" గతానుగతికో లోక : న కోపి పారమార్థిక :
గంగాసైకత లింగేషు నష్టం మే తామ్రభాజనం "

ఒక భిక్షుక సన్యాసి వుండేవాడు. అతడు ప్రతిదినం తనకు దొరికిన అన్నాన్ని భుజిస్తూ, దానం చేసిన ధనాన్ని ఒక రాగిచెంబులో దాచివుంచేవాడు. అలా కొంత కాలానికి ఆ రాగిచెంబు ధనంతో నిండిపోగానే, అతడు తన చిరకాల వాంఛ ననుసరించి, విశ్వనాథుని దర్శనార్థం కాశీకి ప్రయాణమై, అక్కడికి చేరుకున్నాడు.

అతడు మొదట గంగానదిలో స్నానం చేసి, తరువాత దేవుడిని దర్శించాలనుకున్నాడు. "కాని రాగిచెంబును ఎక్కడ దాచడం !?" ఒడ్డున వుంచితే ఎవడైనా దొంగ దానిని తస్కరిస్తాడేమో నని భయపడి, ఇసుకలో గుంతను త్రవ్వి, అందులో రాగిచెంబును వుంచి, దానిపై ఇసుకను కప్పాడు. " కాని, స్నానం చేసి, ఒడ్డుకు వచ్చిన తరువాత, దాని నెలా గుర్తు పట్టడం !? " అతడు ఆలోచించి ఉపాయంతో, దానిపై ఒక ఇసుక లింగాన్ని తయారుచేసి గుర్తుగా వుంచి, గంగానదిలో స్నానం చేయసాగాడు.

ఇంతలో ఒక భక్తుడు అక్కడికి వచ్చి, ఒడ్డున ఇసుక లింగాన్ని వుంచి, గంగానదిలో స్నానమాడుతున్న సన్యాసిని చూసి, అలా చేయడం అక్కడి కాశీ సాంప్రదాయమేమో అనుకొని, తను కూడ ఒక ఇసుక లింగాన్ని తయారు చేసి ఒడ్డున వుంచి, గంగలో స్నానం చేయసాగాడు. కొద్ది సేపట్లో అక్కడికి చేరుకున్న వేలాది భక్తులు తాము కూడ అలాగే ఒడ్డున ఇసుక లింగాలను వుంచి, గంగానదిలో స్నానం చేయసాగారు.

సన్యాసి స్నానానంతరం ఒడ్డుకు రాగానే, అతనికి కొన్ని వేల ఇసుక లింగాలు దర్శనమిచ్చాయి. అందులో తన రాగిచెంబును వుంచిన ఇసుక లింగాన్ని గుర్తుపట్టలేకపోయాడు. ఆ సన్యాసి చివరకు విచారిస్తూ, ఇలా అన్నాడు.
" గతానుగతికో లోక : న కోపి పారమార్థిక :
గంగాసైకత లింగేషు నష్టం మే తామ్రభాజనం "

ఈ సుభాషితం యొక్క భావం :
లోకం అనుకరిస్తుంది. కాని అందులోని పారమార్థాన్ని గ్రహించదు. అయ్యో ! గంగా తీరపు యీ ఇసుక లింగాలలో నా రాగిచెంబును పోగొట్టుకున్నాను గదా !

Tuesday, March 27, 2012

స్వాగతం ! కొత్త సంవత్సరానికి !



ఓ నందన నామ వత్సరమ్మా !
రమ్ము ! అందరికి ఆనంద కారణమ్మువై !
జనులందరికి శుభము గూర్పుము
నందనవనము గావింపుము ఆంధ్రదేశమున్.
ఆమ్ర శాఖాగ్రముల కవికోకిలల్
కవితాగానము సేయుచుండ
నీ కిదే స్వాగతమ్ము రమ్ము !
చైత్రలక్ష్మీ ! వాసంత నందనవై !

ననందల కానంద నిలయమై
రమ్ము ! ఈ శుభవేళ శుభాంగివై !
అందరి ఆశలు వమ్ము చేయక
యిమ్ము శుభముల !
భద్ర తనయా ! నూతన వత్సరమ్మా !
మంచి ప్రభుతను ప్రసాదింపుము కొంచెమైనా !
అతిసంచయేచ్చను వదలింపుము
జనులకు కొంతవరకు
చింతలు లేక ప్రజలెల్ల
సుఖముల నందెదరు గాక !

ఎటులుండునో మున్ముందు యనెడు
సందేహము మాకుంది సుమ్ము !
నిర్భయము గావింపు మమ్ము
అభయ తనూభవవై !
ధరలు నాకసము నంటె,
అవినీతి అంతటా నివ్వటిల్లె !
అంకుశముతో రమ్ము !
ఈ ఉగాది వేళ
ఉగ్ర తనయవై !

కాకు యుగాంతపు సంవత్సరమ్ము !
( కొంతమంది డిశంబరు 21, 2012 "యుగాంతం" అంటున్నారు !? )
కమ్ము నూతనోగాదుల
యుగాది అనవరతము .

{ 25 మార్చి 2012 నాడు హైదరాబాదులో జరిగిన ఓ కవిసమ్మేళనంలో చదవబడిన కవిత }
Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago