పూర్వం హర్ష చక్రవర్తి భారత దేశాన్ని పరిపాలించే కాలంలో "హువాన్ సంగ్ "అనే చైనా దేశస్థుడు భారత దేశాన్ని దర్శించేందుకు వచ్చాడు. అతడు భారత దేశంలో వున్న అనేక ప్రదేశాలు తిరిగాడు. అక్కడి ప్రజల గురించి తెలుసుకున్నాడు. భారతీయ సంస్కృతిని అధ్యయనం చేశాడు. అతడు ఎన్నో గ్రంధాలను ఐతిహాసిక వస్తువులను సేకరించాడు.
హువాన్ సంగ్ స్వదేశానికి తిరిగి వెళుతూ, హర్ష చక్రవర్తిని దర్శించి తన అనుభవాలను నివేదించి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. హర్షుడు అతని రక్షణార్థం ఇరవై మంది సైనికులను అతని వెంట పంపాడు.
హర్షుడు ప్రయాణారంభ సమయంలో సైనికుల నుద్దేశించి, " సైనికులారా! యితని నౌకలో వివిధ భారతీయ ధర్మశాస్త్ర గ్రంధాలు మరియు అనేక ఐతిహాసిక వస్తువులు వున్నాయి. అవి భారతీయ సంస్కృతికి ప్రతీకలు. చాలా అమూల్యమైనవి. అందువల యితనిని మరియు యీ గ్రంధాలను వస్తువులను పరిరక్షించడం మీ కర్తవ్యం. " అని అన్నాడు.
ప్రయాణం ప్రారంభమైంది. చాలా రోజుల వరకూ ప్రయాణంలో ఎటువంటి అవాంతరం కలుగలేదు. అకస్మాత్తుగా ఒకరోజు సముద్రంలో తుఫాను సంభవించింది. దాని మూలంగా నౌక సముద్రంలో ఊగిసలాడసాగింది. " నావ నీళ్ళలో మునిగిపోతుందో ఏమో ? " అన్న శంక ఉత్పన్న మైంది. ఓడ సరంగు భయకంపితుడై యిలా అరిచాడు " నౌక బరువు అధికమైంది. తొందరగా యీ నావలోని గ్రంధాలను వస్తువులను సముద్రంలోకి విసిరివేసి మీ ప్రాణాలను రక్షించుకోండి "
అప్పుడు సేనాపతి సైనికుల నుద్దేశించి యిలా అన్నాడు " యోధులారా ! ఇది మనకు అగ్ని పరీక్ష. ధర్మశాస్త్ర గ్రంధాలను వస్తువులను , వాటి ద్వారా భారతీయ సంస్కృతిని రక్షించడం మన కర్తవ్యం. అందుకు అందరూ సిద్దంగా వుండండి. ప్రాణాలను అర్పించైనా మనం మన కర్తవ్యాన్ని పాలించాలి. "
నాయకుడి మాటలు విన్న మరుక్షణమే సైనికు లందరూ ఒక్కసారిగా సముద్రంలోకి దుమికారు. భారతీయ సంస్కృతిని రక్షించడం కోసం తమ ప్రాణాలను గడ్డిపోచల వలె త్యాగం చేశారు.
అత్యాశ్చర్యకరమైన యీ దృశ్యాన్ని చూసిన హువాన్ సంగ్ కనులలో అశ్రువులు వుబికాయి.
మూలం : సంస్కృత కథా - ప్రాణాదపి సంస్కృతి: శ్రేష్ఠ
( సుగంధ: సంస్కృత కథా సంగ్రహ: నుండి )